అరబిందో రియల్టీ చేతికి రామాయపట్నం పోర్టు!

ABN , First Publish Date - 2021-03-01T06:27:11+05:30 IST

అరబిందో గ్రూప్‌.. ఓడ రేవుల నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఆంరఽధప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకాశం జిల్లా రామాయపట్నంలో అభివృద్ధి చేయతలపెట్టిన ఓడ రేవు నిర్మాణ కాంట్రాక్టు కోసం అరబిందో గ్రూప్‌ సంస్థ.....

అరబిందో రియల్టీ చేతికి రామాయపట్నం పోర్టు!

  • రూ.2,634 కోట్లతో ఈపీసీ బిడ్‌


అరబిందో గ్రూప్‌.. ఓడ రేవుల నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకాశం జిల్లా రామాయపట్నంలో అభివృద్ధి చేయతలపెట్టిన ఓడ రేవు నిర్మాణ కాంట్రాక్టు కోసం అరబిందో గ్రూప్‌ సంస్థ.. అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2,634 కోట్లకు బిడ్‌ సమర్పించింది. ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) పద్దతిలో ఈ పోర్టు నిర్మాణం కోసం కంపెనీ ఈ బిడ్‌ సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన రూ.2,647 కోట్ల కంటే ఈ బిడ్‌ అర శాతం తక్కువ. ఇందుకోసం పోటీపడిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఇంత కంటే ఎక్కువ ధర కోట్‌ చేసింది. దీంతో రామాయపట్నం పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ అరబిందో రియల్టీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అనుభవం ఉన్న సంస్థతో కలిసి: కాగా ఓడ రేవుల నిర్మాణంలో అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా కంపెనీకి అనుభవం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు గాను కృష్ణపట్నం పోర్టు నిర్మాణం, నిర్వహణలో అనుభవం ఉన్న సీవీఆర్‌ గ్రూప్‌ సంస్థ.. నవయుగ ఇంజనీరింగ్‌తో కలిసి అరబిందో రియల్టీ ఈ బిడ్‌ సమర్పించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో రేవు నిర్వహణను కూడా అప్పగిస్తే నవయుగతో ఒప్పందం ఉపయోగపడుతుందని అరబిందో భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్ర విభజన సమయంలో నెల్లూరు జిల్లా దుగ్గరాజుపట్నం వద్ద ప్రధాన ఓడ రేవు నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అది ఆర్థికంగా లాభదాయకం కాదని తేలడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దానికి బదులుగా రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో రూ.14,000 కోట్ల అంచనాతో రెండు దశల్లో సొంతంగా ఈ పోర్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.


Updated Date - 2021-03-01T06:27:11+05:30 IST