అనుమానాస్పద స్థితిలో టీడీపీ కార్యకర్త మృతి
ABN , First Publish Date - 2022-05-29T06:18:34+05:30 IST
టీడీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మండలంలోని రామాపురంలో శనివారం చోటు చేసుకుంది.
దాచేపల్లి, మే 28: టీడీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మండలంలోని రామాపురంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆశం నాగిరెడ్డి(61) టీడీపీలో చురుకైన కార్యకర్తగా ఉన్నాడు. గతంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్గా కూడా పనిచేశాడు. అయితే తనకు పెన్షన్ రాలేదని, దానికి వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని శుక్రవారం ఆరోపించాడు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన నాయకులు, మహిళలు కొందరు నాగిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఘర్షణపడి బెదిరింపులకు పాల్పడ్డారని అతని కుటుంబసభ్యులు తెలిపారు. అంతేకాక నానా దుర్భాషలు ఆడినట్లు పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం 5గంటల సమయంలో నాగిరెడ్డి కనిపించకుండా పోయాడు. అతని కోసం కుటుంబసభ్యులు, బంధువులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం తెల్లవారుజామున పంటపొలాల్లో మృతి చెందిఉన్నాడు. పక్కనే పురుగుమందు డబ్బా ఉంది. అతనితో బలవంతంగా పురుగు మందు తాగించారేమో అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే ఇంటిమీదకు వెళ్లి ఘర్షణ పడ్డారని కుటుంబసభ్యులు రోదిస్తూ వివరించారు. దాచేపల్లి ఎస్ఐ రహంతుల్లా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం జరగనున్న నాగిరెడ్డి అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి హాజరుకానున్నట్లు రామాపురం గ్రామ టీడీపీ నాయకులు తెలిపారు.