నైతికత, నిర్భీతి!

ABN , First Publish Date - 2020-10-18T08:52:46+05:30 IST

నైతికత, నిర్భీతి!

నైతికత, నిర్భీతి!

న్యాయమూర్తికి ఇవే శ్రీరామ రక్ష

ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకుని నిలబడాలి

జస్టిస్‌ లక్ష్మణన్‌ సంతాప సభలో జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా, ఆటుపోట్లు ఎదురైనా న్యాయమూర్తులు తట్టుకుని ధైర్యంగా నిలబడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇది జడ్జిలకు అవసరమైన ముఖ్యమైన లక్షణమని అభిప్రాయపడ్డారు. శనివారం మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఎ.ఆర్‌.లక్ష్మణన్‌ సంతాప సభలో జస్టిస్‌ రమణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన సందేశాన్ని వినిపించారు.   ‘‘ఒక న్యాయమూర్తి నైతిక సూత్రాలకు కట్టుబడి నిర్భయంగా తన నిర్ణయాలను అమలు పరచాలి. శ్రీరాముడిని ప్రజలు ఆరాధిస్తున్నది ఆయన విజయాలు సాధించినందుకు కాదు. అత్యంత క్లిష్టమైన సమయంలో కూడా అత్యంత హుందాతో వ్యవహరించినందుకే ఆయనను ఆరాధిస్తున్నా రు. ఎంత సంపాదించాం, ఏమి చేశాం, ఏం జరిగింది, ఏది జరగలేదు అన్నది ముఖ్యం కాదు. ఏం జరిగినా ఎలా ప్రవర్తించామన్నదే ముఖ్యం. అదే మన సమగ్రతను నిర్ధారిస్తుంది’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఎంతో అవసరమని... న్యాయమూర్తులంతా అందుకు కట్టుబడి ఉండేందుకు జస్టిస్‌ లక్ష్మణన్‌ ప్రేరణగా నిలిచారని అభివర్ణించారు. అత్యంత సమర్థత, తిరుగులేని నిజాయితీ, నిర్భయమైన స్వతంత్రతలను ఆయన వారసత్వంగా ఇచ్చి పోయారని అన్నారు. జస్టిస్‌ లక్ష్మణన్‌ విలువలకు కట్టుబడ్డారని, ఆయన నుంచి తానెంతో నేర్చుకున్నానని చెప్పారు. జస్టిస్‌ లక్ష్మణన్‌ తనకెంతో సన్నిహితుడని, గతంలో ఆయన షష్టిపూర్తికి కూడా హాజరయ్యానని చెప్పారు. జస్టిస్‌ లక్ష్మణన్‌ సతీమణి మీనాక్షి ఆచి, ఆయన కుటుంబ సభ్యులకు జస్టిస్‌ రమణ తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ అటార్నీ జనరల్‌ కె. పరాశరన్‌, మద్రాస్‌ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ కొఠారీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-18T08:52:46+05:30 IST