రామగుండం విపక్ష కార్పొరేటర్లపై నజర్
ABN , First Publish Date - 2021-11-30T05:37:11+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రామగుండం విపక్ష కార్పొరేటర్లపై స్వతంత్ర అభ్యర్థి రవీందర్సింగ్, టీఆర్ఎస్ దృష్టి సారించాయి.
ఐదుగురు కార్పొరేటర్లతో రవీందర్ సింగ్ మంతనాలు
- కాంగ్రెస్ కార్పొరేటర్లతో టీఆర్ఎస్ ముఖ్య నేత భేటీ
గోదావరిఖని/యైటింక్లయిన్కాలనీ నవంబరు 29: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రామగుండం విపక్ష కార్పొరేటర్లపై స్వతంత్ర అభ్యర్థి రవీందర్సింగ్, టీఆర్ఎస్ దృష్టి సారించాయి. ఇప్పటికే ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు బెంగుళూరు క్యాంపునకు వెళ్లారు. టీఆర్ఎస్లో మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ స్వతంత్ర అభ్యర్థి రవీందర్సింగ్కు మద్దతు ఇస్తున్నారు. రవీందర్సింగ్ నామినేషన్ను టీఆర్ఎస్ కార్పొరేటర్ సాగంటి శంకర్తో పాటు కాంగ్రెస్కు చెందిన ఒక కార్పొరేటర్ ప్రతిపాదించారు. మొదట సాధారణ నామినేషన్గానే ఈ ఇద్దరు ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. అనంతర పరిణామాల్లో సాగంటి రవీందర్ సింగ్ వెంటే ఉన్నారు. రామగుండంలో కాంగ్రెస్కు 9, బీజేపీకి ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో వీరి మద్దతు కూడగట్టేందుకు రవీందర్సింగ్ కాంగ్రెస్, బీజేపీ నాయకులను కలుస్తున్నారు. సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను ఆయన నివాసంలో కలిసి మద్దతు కోరారు. అనంతరం కాంగ్రెస్ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముదాం శ్రీనివాస్లను కలిసి మద్దతు కోరారు. యైుటింక్లయిన్కాలనీలో కార్పొరేటర్ సాగంటి శంకర్, బీజేపీ కార్పొరేటర్ కిషన్రెడ్డిలను రవీందర్సింగ్ కలిశారు. కాగా కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ కూడా ప్రయ త్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ కార్పొరేటర్లతో రామగుండం టీఆర్ఎస్ నేతలు ప్రాథమికంగా చర్చించి అవగాహనకు వచ్చారు. ఆదివారం ఎన్టీపీసీలో కాంగ్రెస్ కార్పొరేటర్లతో కీలక మంతనాలు జరిగినట్టు తెలుస్తున్నది. బీజేపీకి చెందిన ఒక కార్పొరేటర్ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. బేరసారాల్లో ఒక్కో కార్పొరేటర్ రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు డిమాండ్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. కాగా విపక్ష కార్పొరేటర్లను కూడా క్యాంపులకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.