అవినాష్ సమక్షంలో ఒక్కటైన రామ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్
ABN , First Publish Date - 2021-04-13T16:19:55+05:30 IST
జమ్మలమడుగు రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకనాటి బద్ధ శత్రువులు.. ఇప్పుడు కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు.
కడప: జమ్మలమడుగు రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకనాటి బద్ధ శత్రువులు.. ఇప్పుడు కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి రుజువు చేశారు. అంతకుముందు గుండ్లకుంట గ్రామంలోని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి స్వగృహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వెంటబెట్టుకుని ఎంపీ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులు వెళ్లారు. అక్కడే అల్పాహారం చేసిన నేతలు... ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో విరోధాన్ని పక్కనపెట్టి పార్టీ కోసం శ్రమిస్తామని మాటిచ్చారు.
ఇదిలా ఉంటే, గత శుక్రవారం వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్తో రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నుంచి ఎమ్మెల్యే టికెట్పై రామసుబ్బారెడ్డి హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల.. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్రెడ్డే వైసీపీ తరఫున పోటీ చేస్తారని.. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మలమడుగు రెండు స్థానాలు అవుతుందని.. అప్పుడు చెరో చోట నుంచి రామసుబ్బారెడ్డి, సుధీర్రెడ్డి పోటీ చేస్తారని సజ్జల తెలిపారు.