రాముడు దేవుడు కాదు, ఒక పాత్ర: మాజీ సీఎం మాంఝీ

ABN , First Publish Date - 2022-04-15T23:33:38+05:30 IST

‘రాముడు దేవుడంటే నేను నమ్మను. తులసీదాస్, వాల్మీకి తమ సందేశాన్ని ప్రజలకు అందించడానికి రూపొందించిన పాత్ర అది. అయితే రామాయణంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి. మనం వాటిని విశ్వసించవచ్చు. రాముడిలో కాదు తులసీదాస్, వాల్మీకిలను నమ్మవచ్చు..

రాముడు దేవుడు కాదు, ఒక పాత్ర: మాజీ సీఎం మాంఝీ

పాట్నా: బిహార్‌లో ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు దేవుడు కాదని.. వాల్మీకి, తులసీదాస్ కల్పించిన ఒక పాత్రని ఆయన అన్న వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి ఎంతమాత్రం రుచించకపోవచ్చు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘రాముడు దేవుడంటే నేను నమ్మను. తులసీదాస్, వాల్మీకి తమ సందేశాన్ని ప్రజలకు అందించడానికి రూపొందించిన పాత్ర అది. అయితే రామాయణంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి. మనం వాటిని విశ్వసించవచ్చు. రాముడిలో కాదు తులసీదాస్, వాల్మీకిలను నమ్మవచ్చు’’ అని మాంఝీ అన్నారు. ఇంతటితో ఆగకుండా రాముడికి శబరి రేగు పండు తినిపించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. ‘‘మీరు రామాయణం గురించి వింటే శబరి కొరికి ఇచ్చిన రేగు పండును రాముడు తిన్నట్లు చెప్తుంటారు. కానీ మనం ఏ పండునైనా కనీసం ముట్టుకున్నా తినరు’’ అని దళితులను ఉద్దేశించి ఆయన అన్నారు.


బిహార్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన జితన్ రాం మాంఝీ.. ఒకప్పుడు జేడీఎస్‌లో కీలక నేత. అయితే ముఖ్యమంత్రి కుర్చీ విషయంతో నితీష్‌తో వివాదాలు తలెత్తడంతో పార్టీ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అనే పర్టీ పెట్టి.. మొదటి నుంచి బీజేపీకి భాగస్వామిగా ఉంటూ వస్తున్నారు. ఇక మాంఝీ కుమారుడు సంతోష్ మాంఝీ ప్రస్తుతం నితీష్ కుమార్ కెబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.

Updated Date - 2022-04-15T23:33:38+05:30 IST