ఎగ్గొట్టి..ఎగిరెళ్లిపోయారు!

ABN , First Publish Date - 2020-05-10T07:16:34+05:30 IST

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటి కార్పొరేట్‌ ప్రముఖులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. మరో డిఫాల్ట్‌ కంపెనీకి చెందిన...

ఎగ్గొట్టి..ఎగిరెళ్లిపోయారు!

  • ఎస్‌బీఐ కన్సార్షియానికి రూ.414 కోట్ల ఎగవేత 
  • దేశం విడిచి పరారైన ‘రామ్‌ దేవ్‌’ ప్రమోటర్లు


విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటి కార్పొరేట్‌ ప్రముఖులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. మరో డిఫాల్ట్‌ కంపెనీకి చెందిన ప్రమోటర్లు.. దేశం విడిచి ఏనాడో పరారైన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన.. ఆ కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు నాలుగేళ్ల తర్వాత సీబీఐకి ఫిర్యాదు చేశాయి. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రామ్‌ దేవ్‌ ఇంటర్నేషనల్‌.. విదేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతి చేసే కంపెనీ. హరియాణాలోని కర్నాల్‌ జిల్లాలో ఈ కంపెనీకి 3 రైస్‌ మిల్లులతో పాటు 8 సార్టింగ్‌, గ్రేడింగ్‌ యూనిట్లు ఉన్నాయి. సౌదీ అరేబియా, దుబాయ్‌లోనూ వాణిజ్య కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని 6 బ్యాంకుల కన్సార్షియానికి ఈ కంపెనీ రూ.414 కోట్లు ఎగవేసింది. దీని ప్రమోటర్లు నరేశ్‌ కుమార్‌, సురేశ్‌ కుమార్‌, సంగీత గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి పారిపోయారు.


దుబాయ్‌లో తలదాచుకున్నట్లు సమాచారం. కానీ, వీరు పరారైన నాలుగేళ్ల తర్వాత బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే, వారు విదేశాలకు పరారైన విషయం 2018లో రూడీ అయినందునే ఫిర్యాదు చేయడం జాప్యమైందని ఎస్‌బీఐ కన్సార్షియం సమర్థించుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ కన్సార్షియం సీబీఐకి ఫిర్యాదు సమర్పించింది. ఏప్రిల్‌ 28న కేసు నమోదు చేసిన దర్యాప్తు ఏజెన్సీ.. వారికి వ్యతిరేకంగా లుక్‌అవుట్‌ నోటీసులూ జారీ చేసింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా సీబీఐ ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి సోదాలు నిర్వహించలేకపోయింది. త్వరలోనే వీరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే, చట్టపరంగా చర్యలు చేపట్టనున్నట్లు సీబీఐ తెలిపింది. 




ఎస్‌బీఐ కన్సార్షియం ప్రకారం.. 2016 జనవరి 27న ఈ కంపెనీ రుణం మొండి బకాయి (ఎన్‌పీఏ)గా మారింది. ఆ తర్వాత 7-9 నెలలకు (ఆగస్టు-అక్టోబరు) కంపెనీ ఆస్తులు తనిఖీ చేసేందుకెళ్లిన బ్యాంకు అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది. అప్పటికే ప్లాంట్‌లోని యంత్రాలను ప్రమోటర్లు మాయం చేశారు. వారీ ఆచూకీ కూడా లేదు. బ్యాంక్‌ రుణాలతో అక్రమ లబ్ధి పొందేందుకు వీరు తప్పుడు బ్యాంక్‌ ఖాతాలు, బ్యాలెన్స్‌షీట్‌ను సమర్పించారని ఎస్‌బీఐ కన్సార్షియం ఫిర్యాదులో పేర్కొంది.  

Updated Date - 2020-05-10T07:16:34+05:30 IST