బంధాలకు రక్ష!

ABN , First Publish Date - 2020-07-31T04:46:45+05:30 IST

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరించే శుక్రవారంతో పాటు మరో ప్రధానమైన పర్వదినం శ్రావణ పూర్ణిమ.

బంధాలకు రక్ష!

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరించే శుక్రవారంతో పాటు మరో ప్రధానమైన పర్వదినం శ్రావణ పూర్ణిమ. దీన్నే ‘రాఖీ పౌర్ణమి’గా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మధు కైటభులు అనే రాక్షసులను సంహరించడానికి హయగ్రీవునిగా మహావిష్ణువు అవతారం ఎత్తిన రోజు ఇది. వైష్ణవ పూజా విధానాలకు మూలమైన వైఖానస ఆగమానికి మూలపురుషుడు విఖనస మహర్షి జన్మించినది కూడా ఈ రోజే! అలాగే వినాయక పుత్రికగా పరిగణించే సంతోషీమాత ఆవిర్భవించిన రోజు ఇదే. తెలుగు వారికి ‘జంథ్యాల పౌర్ణమి’గా కూడా ఇది ప్రసిద్ధం. వేదాధ్యయనాన్ని ప్రారంభించడానికి పవిత్రమైన రోజుగా కూడా శ్రావణ పూర్ణిమను పరిగణిస్తారు.


భారతీయ సంస్కృతికి జ్ఞాన, విజ్ఞాన సంపదను అందించిన, మంత్రద్రష్టలైన సప్తఋషులను ఈ రోజున పూజించే సంప్రదాయం ఉంది.  దేశమంతటా ‘రక్షాబంధన పూర్ణిమ’గా శ్రావణ పూర్ణిమను జరుపుకొంటారు. ‘రక్ష’ అంటే రక్షణ కోసం ధరించే సూత్రం. దీనికి ‘తోరం’ అనీ, ‘తాయెత్తు’ అనీ అర్థాలున్నాయి. రక్షను కుడి ముంజేతికి ధరింపజేయాలి. ఈ రక్ష మంత్రాలతో పవిత్రం చేస్తే ఎంతో శక్తి కలిగి ఉంటుందనీ, అమంగళాలను తొలగించి, విజయాలను అందిస్తుందనీ విశ్వాసం. ఇంద్రుడికి శచీదేవి కట్టిన రక్ష బలిని ఓడించేలా చేసిందని ఒక కథ ఉంది. 


అందుకని- 

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః

తేన త్వా మభిబధ్నామి రక్షే! మాచలమాచల! - అనే మంత్ర శ్లోకాన్ని పఠిస్తూ రక్షను కట్టాలన్నది పెద్దల మాట. 

పౌరాణికంగానూ, చరిత్రలోనూ రక్ష ప్రభావాన్ని వివరించే ఎన్నో కథలు ఉన్నాయి. ఆధునిక కాలంలో సోదరీ సోదరుల అనురాగానికి చిహ్నమైన ‘రాఖీ’గా అది రూపుదిద్దుకుంది. - ఆగస్టు 3న శ్రావణ పూర్ణిమ

Updated Date - 2020-07-31T04:46:45+05:30 IST