రాజ్యసభలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం
ABN , First Publish Date - 2020-09-17T16:58:16+05:30 IST
రాజ్యసభలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగింది. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల ఎండగట్టారు.
న్యూఢిల్లీ: రాజ్యసభలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగింది. కరోనాపై పోరులో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల ఎండగట్టారు. కనకమేడల తర్వాత మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అమరావతిపై సిట్ దర్యాప్తుకు హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సభలో ప్రస్తావించారు. న్యాయస్థానం ముందున్న అంశాలను సభలో ప్రస్తావించొద్దని టీడీపీ ఎంపీ కనకమేడల అడ్డుపడ్డారు. విజయసాయి వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు.
కోవిడ్-19 చర్యలపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి.. ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ ఇతర అంశాలను ప్రస్తావించారు. దీనిపై కనకమేడల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనవసర అంశాలపై ప్రస్తావన తెస్తూ సభను తప్పుదోవ పట్టించడం తగదన్న కనకమేడల అన్నారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ కోర్టుల పరిధిలోని అంశాలపై చర్చించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో మాట్లాడడం ద్వారా కోర్టులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని కనకమేడల వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ను కోరారు. ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం లాంటి అంశాలపై మాట్లాడరాదంటూ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ వారించినా... వినకుండా అలాగే మాట్లాడుతూ పోయారు.