ఆరు.. పోరు...
ABN , First Publish Date - 2022-06-04T16:29:34+05:30 IST
రాష్ట్రంలో నాలుగు స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల బరిలో ఆరుగురు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ శుక్రవారంతో ముగిసింది.
- రాజ్యసభ బరిలో ఆరుగురు
- ముగిసిన ఉపసంహరణలు
- తప్పని ఎన్నికలు
- కాంగ్రెస్ నిర్ణయంతో జేడీఎస్ కుదేలు
బెంగళూరు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగు స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల బరిలో ఆరుగురు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ శుక్రవారంతో ముగిసింది. నామినేషన్ దాఖలు చేసినవారంతా బరిలో కొనసాగేందుకే మొగ్గు చూపారు. రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల అంశం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మూడు పార్టీలలోనూ బెంగళూరు నుంచి ఢిల్లీదాకా సాగింది. రాష్ట్ర నేతలు తీసుకున్న నిర్ణయానికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు వత్తాసు పలికారు. రాష్ట్ర శాసనసభ్యులనుంచి రాజ్యసభ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. బీజేపీ నుంచి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సీనియర్ నటుడు జగ్గేశ్ల విజయానికి ఢోకా లేదు. కానీ మిగులు 32 ఓట్లకోసం లెహర్సింగ్ సిరోయా నామినేషన్ వేశారు. ఇతడికి మరో 13 ఓట్లు అవసరంగా ఉంది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ బరిలో ఉండగా ఆయన గెలుపునకు ఢోకా లేదు. వీరికి అదనంగా 26 ఓట్లు ఉండడంతో మన్సూర్ అలిఖాన్చే నామినేషన్ వేయించారు. జేడీఎస్ కు కేవలం 32 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు కుపేంద్రరెడ్డి నామినేషన్ వేశారు. ఈయన గెలుపునకు మరో 13మంది మద్దతు అవసరం ఉంది. రాజ్యసభ ఎన్నికలు ప్రస్తుతం జేడీఎస్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన గెలుపు సాధ్యం కాదని భావించి ఎమ్మెల్యేలు ఇతరులకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైతే రాజకీయ వ్యూహమే మారిపోనుంది. ఒకవేళ జేడీఎస్ ఎవరికి మద్దతు ఇవ్వకపోతే బీజేపీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఒకరు మాత్రమే గెలుపొందుతారు. నాలుగుస్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం అనివార్యం అవుతుంది. ఒక రాజ్యసభ సభ్యుడు గెలుపొందాలంటే 45మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మొత్తానికి ఏకగ్రీవం అవుతాయనుకున్న రాజ్యసభకు ఎన్నికలు తప్పడం లేదు.