ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ప్రకటన హర్షణీయం
ABN , First Publish Date - 2022-05-18T05:50:33+05:30 IST
ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ప్రకటన హర్షణీయం
- బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్
వికారాబాద్, మే 17 : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత 40ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసి, బీసీల కోసం అనునిత్యం పోరాటాలు చేసిన వ్యక్తి ఆర్.కృష్ణయ్య అని, మండల వ్యవస్థను పోరాడి సాధించారని గుర్తుచేశారు. బీసీల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని, విద్యార్థుల కోసం స్కాలర్షి్పలు, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం, హాస్టల్ వ్యవస్థ వంటి వాటి కోసం కృష్ణయ్య ఎన్నో ఉద్యమాలు చేశారని, ఆయన సేవలను కొనియాడారు. వికారాబాద్ జిల్లాలోని రాళ్లగుడుపల్లి వాసి ఆర్.కృష్ణయ్య బీసీల మద్దతుతో తెలంగాణ సీఎం కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
- చాలా సంతోషంగా ఉంది
- రాళ్లగుడుపల్లి సర్పంచ్ సావిత్రమ్మ
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని మోమిన్పేట్ మండలం రాళ్లగుడుపల్లి సర్పంచ్ సావిత్రమ్మ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన బిడ్డకు ఉన్నత గౌరవం కల్పించినందుకు ఏపీ సీఎం జగన్కు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు.