గర్భస్రావంపై కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABN , First Publish Date - 2021-03-17T00:34:20+05:30 IST

ప్రత్యేక సందర్భాల్లో మహిళలు గర్భస్రావం చేయించుకోవడానికి

గర్భస్రావంపై కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ : ప్రత్యేక సందర్భాల్లో మహిళలు గర్భస్రావం చేయించుకోవడానికి సంబంధించిన ముఖ్యమైన బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. అత్యాచార బాధితులు, వావివరుసలేని లైంగిక సంబంధాల బాధితులు, మైనర్లు, దివ్యాంగులు సహా ప్రత్యేక వర్గాలకు చెందిన మహిళలు గర్భస్రావం చేయించుకోవడానికి కాల పరిమితిని పెంచేందుకు ఈ బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం గర్భం ప్రారంభమైనప్పటి నుంచి 20 వారాల వరకు గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి ఉంది. దీనిని 24 వారాలకు పెంచేందుకు ఈ బిల్లు ప్రతిపాదించింది. 


మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971ను సవరిస్తూ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అమెండ్‌మెంట్) బిల్, 2020ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును ఏడాది క్రితమే లోక్‌సభ ఆమోదించింది. 


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేశామని, మన దేశంలో కూడా విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే ఈ బిల్లును రూపొందించామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తాము మహిళలకు వ్యతిరేకంగా ఏ చట్టాన్నీ రూపొందించబోమని వివరించారు. 


ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాలని వచ్చిన డిమాండ్‌ను రాజ్యసభ తోసిపుచ్చింది. ఈ బిల్లును ఆమోదించినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. 


Updated Date - 2021-03-17T00:34:20+05:30 IST