రెండు వారాల్లో 40 పనిగంటలు కోల్పోయిన రాజ్యసభ
ABN , First Publish Date - 2021-07-31T21:52:01+05:30 IST
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రెండు వారాల్లో పెద్దల సభ..
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రెండు వారాల్లో పెద్దల సభ (రాజ్యసభ) పనిగంటల సక్రమ వినియోగం గణనీయంగా పడిపోయింది. మొత్తం 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయినట్టు అధికార ప్రకటన వెల్లడించింది. ''సభా కార్యక్రమాల అంతరాయం కొనసాగుతుండటంతో పని గంటల వినియోగం గణనీయంగా పడిపోయింది. తొలి వారంలో 32.20 శాతంగా ఉన్న పనిగంటల వినియోగం, రెండోవారంలో 13.70 శాతానికి పడిపోయింది. సరాసరి ప్రొడక్టివిటీ రేటు 21.60కు చేరింది. మొత్తం 50 పనిగంటల్లో 39 గంటల 52 నిమిషాల పని గంటలను సభ కోల్పోయింది. అయితే షెడ్యూల్ సమయం కంటే ఒక గంట 12 నిమిషాలు ఎక్కవగానే సభ నిర్వహించినప్పటికీ ప్రొడక్టివిటీ మాత్రం మొత్తం మీద తగ్గింది'' అని ఆ ప్రకటన పేర్కొంది.
కోవిడ్ సంబంధిత అంశాలపై 4 గంటల 37 నిమిషాల పాటు చర్చించగా, మొదటివారంలో ఐటీ మంత్రి పెగాసస్ స్పైవేర్పై ప్రకటన చేశారని తెలిపింది. ఇంతవరకూ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు-2021, జ్యువనైల్ జస్టిస్ అమెండ్మెంట్ బిల్లు 2021, ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు 2021, కోకోనట్ డవలప్మెంట్ బోర్డ్ (సవరణ) బిల్లు 2021 సభామోదం పొందాయి. లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ (అమెండ్మెంట్) బిల్లు 2021, డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (అమెండ్మెంట్) బిల్లు 2021తో సహా మొత్తం 4 బిల్లులు రాజ్యసభలో ప్రవేశపెట్టారు.