జూన్‌ రెండోవారంలో రాజ్యసభ ఎన్నికలు?

ABN , First Publish Date - 2021-05-14T12:46:48+05:30 IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల కోసం జూన్‌ రెండోవారంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మూడు స్థానాలను అధికార డీఎంకే...

జూన్‌ రెండోవారంలో రాజ్యసభ ఎన్నికలు?

పెరగనున్న డీఎంకే బలం

చెన్నై: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల కోసం జూన్‌ రెండోవారంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మూడు స్థానాలను అధికార డీఎంకే పార్టీ సునాయసంగా గెలుచుకోనుంది. దీనితో రాజ్యసభలో డీఎంకే సభ్యుల బలం పెరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో డీఎంకేకు ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఎండీఎంకే నేత వైగో డీఎంకే తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక అన్నాడీఎంకేకు ఐదుగురు సభ్యులు, పీఎంకే, టీఎంసీలకు తలా ఒక సభ్యుడు ఉన్నారు. 2019లో అన్నాడీఎంకే తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మహమ్మద్‌ జాన్‌ గత మార్చిలో మృతి చెందారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేపీ మునుసామి, వైద్యలింగం పోటీ చేసి శాసనసభ్యులుగా గెలిచారు.


ఇటీవల ఆ ఇరువురూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనితో రాష్ట్రానికి సంబంధించి ముగ్గురి రాజ్యసభ సీట్లు ఖాళీపడ్డాయి., ఈ మూడు స్థానాలకు జూన్‌ మూడో వారంలోపున ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం శాసనసభలో అధికార డీఎంకేకు మెజారిటీ సభ్యులు వుండటంతో ఈ మూడు సీట్లను సునాయసంగా గెలుచుకోనుంది. ఈ మూడు రాజ్యసభ సీట్ల కోసం అప్పుడే డీఎంకేలోని సీనియర్‌ నాయకులు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. డీఎంకే తరఫున బోడినాయకనూర్‌ నియోజకవర్గంలో అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఒ. పన్నీర్‌సెల్వంపై పోటీ చేసి ఓటమిపాలైన తంగతమిళ్‌సెల్వన్‌, మోడకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన డీఎంకే సీనియర్‌ మహిళా నాయకురాలు సుబ్బులక్ష్మి జగదీశన్‌ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ కూడా వీరిరువురి ఎంపికకు అంగీకరించడం ఖాయమని పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. మరో సీటును మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనపబరచటం లేదు. దీనితో మూడు సీట్లకు డీఎంకే అభ్యర్థులే పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

Updated Date - 2021-05-14T12:46:48+05:30 IST