రాజ్యసభలో రగడ.. సస్పెండ్ అయినా సభలోనే ఎంపీలు..!

ABN , First Publish Date - 2020-09-21T16:58:13+05:30 IST

వివాదాస్పద వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో రాజ్యసభలో సస్పెన్షన్ వేటు పడిన ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి...

రాజ్యసభలో రగడ.. సస్పెండ్ అయినా సభలోనే ఎంపీలు..!

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో రాజ్యసభలో సస్పెన్షన్ వేటు పడిన ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి బయటికి వెళ్లేందుకు అంగీకరించలేదు. ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించినప్పటికీ... వారంతా సభలోనే ఉండి ఆందోళన కొనసాగిస్తున్నారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు సస్పెన్షన్ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసనకు దిగడంతో.. రెండు గంటల వ్యవధిలో సభ నాలుగు సార్లు వాయిదా పడింది. సస్పెన్షన్ వేటు పడిన ఎంపీలు బయటికి వెళ్లిపోవాలంటూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు కోరినప్పటికీ.. సభ్యులు పట్టించుకోలేదు. ఆ ఎంపీలు బయటికి వెళ్తేనే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని ఉపసభాపతి స్పష్టం చేశారు. అయితే అందుకు ప్రతిపక్ష సభ్యులు ససేమిరా అనడంతో సభను మరో అరగంట వాయిదా వేస్తున్నట్టు హరివంశ్ ప్రకటించారు. కాగా సస్పెండ్ అయిన ఎంపీలకు సభలో ఉండే హక్కు లేదనీ... సభ్యులు కాని వారు లోపల ఉండగా సభా కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉండదని బీజేపీ ఎంపీ మురళీధరన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-21T16:58:13+05:30 IST