లాక్డౌన్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఆందోళన వద్దు : రాజేశ్ తోపే
ABN , First Publish Date - 2021-04-13T00:49:30+05:30 IST
రాష్ట్రంలో లాక్డౌన్ విధించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు
ముంబై : రాష్ట్రంలో లాక్డౌన్ విధించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. అయితే ప్రజలు మాత్రం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరమే లేదని భరోసా ఇచ్చారు. అయితే లాక్డౌన్పై సీఎం సోమవారమే ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కరోనాపై సీఎం ఉద్ధవ్ సోమవారం అధికారులతో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. అయితే లాక్డౌన్పై అంతిమ నిర్ణయం మాత్రం సీఎం ఉద్ధవ్ మాత్రమే తీసుకుంటారని, లాక్డౌన్తో పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా తగు ఉపాయాలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు.
లాక్డౌన్ పై బీజేపీ వర్సెస్ ఎన్సీపీ
అయితే లాక్డౌన్ పై రాజకీయ పక్షాల మధ్య విమర్శలకు దారి తీసింది. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ లాక్డౌన్ విధించిన సమయంలో ఎవరితోనైనా చర్చించారా? ఎవరి సలహాలనైనా తీసుకున్నారా? అంటూ మంత్రి నవాబ్ మాలిక్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఎవరి అకౌంట్లలో డబ్బులు వేశారా? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్పై ప్రశ్నించే అధికారం బీజేపీకి లేదని అన్నారు. కేవలం రాజకీయాల కోసమే రాష్ట్రంలో బీజేపీ లాక్డౌన్ను విమర్శిస్తోందని నవాబ్ మాలిక్ ఆరోపించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ లాక్డౌన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అని, అయితే పేద ప్రజలు మాత్రం తీవ్రమైన కోపంతో ఉన్నారని పేర్కొన్నారు. లాక్డౌన్కు ప్రత్యామ్నాయాలను చూడాలని సీఎం ఉద్ధవ్ను ఫడ్నవీస్ కోరారు.