నెలకు రూ.75 వేల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చినా రిజెక్ట్.. ఈ 21 ఏళ్ల యువతికి ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తోంటే..

ABN , First Publish Date - 2022-04-11T21:25:00+05:30 IST

ఆ యువతిది రాజస్థాన్ జిల్లా. మారుమూల గ్రామంలో వెనకబడిన సామాజిక వర్గంలో జన్మించింది. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి.. ఉన్నత చదువులు చదివింది. నెలకు రూ.75వేల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చినా మరో ఆలోచన లేకుండా నో చెప్పేసిం

నెలకు రూ.75 వేల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చినా రిజెక్ట్.. ఈ 21 ఏళ్ల యువతికి ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తోంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతిది రాజస్థాన్ రాష్ట్రం. మారుమూల గ్రామంలో వెనకబడిన సామాజిక వర్గంలో జన్మించింది. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి.. ఉన్నత చదువులు చదివింది. నెలకు రూ.75వేల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చినా మరో ఆలోచన లేకుండా నో చెప్పేసింది. అనుకున్న లక్ష్యానికి అడుగు దూరానికి వెళ్లి ఆగినా.. తగ్గేదే లేదంటోంది. చిన్ననాటి నుంచి కలలు గన్న లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించేది లేదంటున్న ఆ యువతికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సుందర్ గడియా.. ఆమెకు ప్రస్తుతం 21ఏళ్లు. కమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఈ యువతి ఉదయ్‌పూర్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించింది. రాజస్థాన్‌లో ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అన్ని విషయాల్లో చాలా వెనకబడ్డారు. ఇప్పటికీ ఆ సామాజిక వర్గంలోని ఆడ పిల్లలకు 8-10ఏళ్ల వయసులోనే పెళ్లి చేస్తారు.  అటువంటి సామాజిక వర్గంలో పుట్టిన సుందర్ గడియా.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించింది. పెళ్లి కోసం తండ్రి తొందర పెట్టినప్పటికీ.. తల్లి సహాయంతో ఉన్నత విద్యను అభ్యసించింది. అమ్మమ్మ ఇంట్లో ఉంటూనే కెమికల్ ఇంజినీరింగ్ చేసింది. ఫైనల్ ఇయర్‌లో ఉండగానే నెలకు రూ.75వేల భారీ జీతంతో జాబ్ ఆఫర్ వచ్చినప్పటికీ మరో ఆలోచన చేయకుండా దానికి నో చెప్పింది.



ఐఏఎస్ అవటమే లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సిద్ధం అయింది. ఈ క్రమంలో యూపీఎస్సీ ఎగ్జామ్‌లో 600 ర్యాంకు పొంది సత్తా చాటింది. అయితే ఈ ర్యాంకుతో ఐఏఎస్‌‌కు ఎంపిక కాలేకపోయిన ఆమె.. లక్ష్యాన్ని సాధించడం కోసం మరోసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతానని చెబుతోంది. కాగా.. యూపీఎస్సీలో మెరుగైన ర్యాంకు సాధించిన సుందర్ గడియాను కుటుంబ సభ్యులు అభినందించారు. ఇదిలా ఉంటే.. స్థానికంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడిన ఆమె.. మాజీ ప్రధాని నెహ్రూ తమ సామాజిక వర్గం బాగుకోసం ఎన్నో అవకాశాలు కల్పించారని వెల్లడించింది. అయినా ప్రజలు ఇప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని వాపోయింది. 




Updated Date - 2022-04-11T21:25:00+05:30 IST