ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ఆమోదం
ABN , First Publish Date - 2020-08-10T21:09:34+05:30 IST
రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. ఆగస్టు 14 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. దీని కోసం ముఖ్యమంత్రి..
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. ఆగస్టు 14 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. దీని కోసం ముఖ్యమంత్రి గెహ్లాట్ ఇప్పటికే అనేక సార్లు గవర్నర్ను కలిసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు శుక్రవారం నుంచి ఈ సమావేశాలకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం సూచనల మేరకు అన్ని రకాల నిబంధనలనూ పాటిస్తూ సమావేశాలను నిర్వహించుకోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే రాజస్థాన్లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. సీఎం గెహ్లాట్కు, ప్రధాన నేత సచిన్ పైలట్కు మధ్య వివాదమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో పైలట్ను కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన మద్దతు దారులైన ఎమ్మెల్యేలు బహిరంగంగానే గెహ్లాట్ను విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే గెహ్లాట్ మాత్రం ఇతర సమస్యల పైనే సమావేశాలు కొనసాగుతాయని, అందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను అనేకమార్లు కోరారు. కానీ కరోనా నేపథ్యంలో గవర్నర్ తిరస్కరించారు. ఎట్టకేలకు ఆయన ఆమోదం తెలపడంతో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.