సింధియా బాటలో పైలట్! రాహుల్‌ పిలిచినా వెళ్లకపోవడంతో అనుమానాలు

ABN , First Publish Date - 2020-07-12T23:51:44+05:30 IST

జైపూర్: రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ జ్యోతిరాదిత్య సింధియా బాటలో పయనించబోతున్నాడా? పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సింధియా బాటలో పైలట్! రాహుల్‌ పిలిచినా వెళ్లకపోవడంతో అనుమానాలు

జైపూర్: రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ జ్యోతిరాదిత్య సింధియా బాటలో పయనించబోతున్నాడా? పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తన మద్దతుదారులతో ఢిల్లీకి చేరుకున్న సచిన్‌ను తనను కలిసేందుకు రావాలని రాహుల్ పిలిచినా రాకపోవడం కలకలం రేపుతోంది. సాయంత్రం ఐదున్నరకు తనను కలవాలంటూ రాహుల్ సచిన్‌కు ఆహ్వానం పంపినట్లు తెలిసింది.


గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారన్న ఆరోపణలపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ నుంచి నోటీసులు అందడంతో అలిగిన ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ తన మద్దతుదారులతో కలిసి హస్తినకు చేరుకున్నారు. దీంతో పైలట్‌ను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలని రాహుల్ గాంధీ యత్నాలు ముమ్మరం చేశారు. కానీ పైలట్ నుంచి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు రాత్రి 9 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జైపూర్‌లో సమావేశం కావాలని సీఎం గెహ్లాట్ ఆదేశించారు. సమావేశానికి రానివారందరినీ పైలట్ వర్గీయులుగా భావించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.  


ప్రస్తుతం సచిన్ పైలట్ ఉపముఖ్యమంత్రిగానూ, రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. అయితే ఆయన వద్ద రెండు పదవులూ ఉండటం గెహ్లాట్‌కు ఇష్టం లేదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. సచిన్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరగడం గెహ్లాట్ ఇష్టపడటం లేదని మీడియాలో కథనాలు వస్తునే ఉన్నాయి. కాంగ్రెస్ రాజకీయాలు ఇష్టం లేక సింధియా తరహాలో సచిన్ కూడా పార్టీ వీడతాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 200 మంది ఎమ్మెల్యేలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా గెహ్లాట్ సర్కారుకు మద్దతిస్తున్నారు. అయితే సచిన్ పైలట్ వర్గీయులు పట్టుబడితే గెహ్లాట్ సర్కారు కూలిపోయే అవకాశం ఉంది. పైలట్‌కు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సమాచారం. మరోవైపు తాజా పరిణామాలను కమలనాథులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అవకాశం వస్తే సింధియా తరహాలో పైలట్‌ను కూడా పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. 

Updated Date - 2020-07-12T23:51:44+05:30 IST