గెహ్లాట్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
ABN , First Publish Date - 2021-11-20T21:28:15+05:30 IST
కొద్దికాలంగా ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్..
జైపూర్: కొద్దికాలంగా ఎదురుచూస్తున్న అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు గవర్నర్ నివాసంలో కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం ఉంటుందని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఇందుకు మార్గం సుగమం చేసేందుకు శనివారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశమవుతోంది. మంత్రులందరినీ రాజీనామా చేయాల్సిందిగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ సమావేశంలో కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అశోక్ గెహ్లాట్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. కొత్తగా ఎవరెవరికి కేబినెట్లో చోటు కల్పించనున్నారనేది ఇంకా స్పష్టం కానప్పటికీ , శుక్రవారం సాయంత్రం నుంచి ఎమ్మెల్యేలందరితో మంతనాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.
కాగా, శనివారం సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశానంతరం కొత్తగా కేబినెట్లో తీసుకునే వారి జాబితా రెడీ చేసి, వారితో ఆదివారం సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ కల్రాజ్ మిశ్రా శనివారం సాయంత్రంకల్లా తిరిగి జైపూర్ చేరుకుంటారు. రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్చార్జి అజయ్ మాకెన్ ప్రస్తుతం జైపూర్లోనే ఉన్నారు. కేబినెట్లో ఎవరికి చోటు కల్పించాలనే విషయంపై ముఖ్యమంత్రితో ఆయన మంతనాలు జరుపుతున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సైతం శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి జైపూర్కు చేరుకుంటున్నారు. కేబినెట్ విస్తరణకు పేర్లు ఖరారు చేయడానికి ముందే అజయ్ మాకెన్ను ఆయన కలుసుకోనున్నారు. ఈ సాయంత్రానికల్లా ఎవరెవరికి కేబినెట్లో చోటు దక్కనుందనే విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.