భాగ్యనగరంలో భారీ వర్షం.. రాజాసింగ్-కాలేరు సంవాదం
ABN , First Publish Date - 2022-05-06T15:24:36+05:30 IST
భాగ్యనగరంలో భారీ వర్షం.. రాజాసింగ్-కాలేరు సంవాదం
- నగరం మునకపై ట్విటర్లో పోస్టులు
హైదరాబాద్ సిటీ : నగరం మునకపై టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ట్విటర్లో సంవాదం నడిచింది. బుధవారం కురిసిన భారీ వర్షానికి గోషామహల్లోని బేగంబజార్, గౌలిగూడ గురుద్వార్, ఉస్మాన్సాగర్గంజ్ పరిధిలో ముంపు ప్రాంతాలను ట్విటర్లో పోస్ట్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.. గంటన్నరపాటు కురిసిన వర్షానికి నగర పరిస్థితి కళ్లకు కట్టింది. ట్విటర్లో గొప్పలు చెప్పుకోవడం కాదు.. క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
దీనిపై స్పందించిన అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. గుజరాత్లో నగరాల్లో వర్షం కురిసినప్పుడు పరిస్థితి చూడండి.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోని నగరాల్లో ఇవీ పరిస్థితులంటూ.. ఫొటోలు పోస్ట్చేసి ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని పేర్కొన్నారు. వీరి ట్వీట్లపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పక్క నగరాల విషయం ప్రస్తావించడం కాదు.. మన సిటీలో ఎంతమేర అభివృద్ధి చేశామన్నది ప్రధానమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో చెప్పాలని మరో నెటిజన్ స్పందించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎక్కడైనా ఇదే జరుగుతోందని మరొకరు అభిప్రాయపడ్డారు.