రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం...!
ABN , First Publish Date - 2021-10-20T05:15:34+05:30 IST
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని, మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయం, విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయం పై వైసీపీ ముఖ్యులు దాడి చేయడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్ పేర్కొన్నారు.
టీడీపీ కార్యాలయాలపై దాడి సిగ్గుచేటు
డీజీపీ రాజీనామా చేయాలి
టీడీపీ నేతల డిమాండ్
కడప, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని, మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయం, విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయం పై వైసీపీ ముఖ్యులు దాడి చేయడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్ పేర్కొన్నారు. కడప అసెంబ్లీ ఇన్చార్జ్ అమీర్బాబు ఇంటిపై దాడిని వీరు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడుగంటిపోయిందనడానికి ఈ రోజు జాతీయ పార్టీ కార్యాలయంపై జరిగిన భౌతిక దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం నిదర్శనమని పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న జాతీయ నాయకుడు చంద్రబాబునాయుడు ఇంటిపై మొన్న దాడి, ఈ రోజు జాతీయ పార్టీ కార్యాలయంపై దాడి, రాష్ట్రంలో ప్రతిపక్షానికే రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయ పార్టీ కార్యాలయంపై వందలాది మంది వైసీపీ గూండాలు వచ్చి దాడులు చేస్తుంటే రాష్ట్ర డీజీపీ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినందుకు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ఇంటిపై దాడి, మహిళను గాయపరచడం, కడప అసెంబ్లీ బాధ్యుడు అమీర్బాబు ఇంటిపై మూకుమ్మడిగా వందలాది మంది వైసీపీ గూండాలు దాడులకు పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకుని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.