రాజరాజేశ్వరి అలంకారంలో కామాక్షితాయి
ABN , First Publish Date - 2022-10-01T03:46:19+05:30 IST
మండలంలోని జొన్నవాడ ఆలయంలో శుక్రవారం కామాక్షితాయి రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు30: మండలంలోని జొన్నవాడ ఆలయంలో శుక్రవారం కామాక్షితాయి రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం పుణ్యాహవచనం, కలశపూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో నవావరణ పూజలు చేయించుకున్నారు. సాయంత్రం సామూహిక కుంకుమార్చన, రాత్రి అమ్మవారికి కాళరాత్రి మహానవావరణ పూజలు, కొలువు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరుకు చెందిన ఆరుగుంట హరికిషోర్రెడ్డి కుటుంబం ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ.ఈవో డీ వెంకటేశ్వర్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాగా శనివారం కామాక్షితాయికి భండాసురవధ అలంకారం జరగనున్నది.
మోహినీ అలంకారంలో కోదండరాముడు
బుచ్చి పెద్దూరులోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, దుర్గానగర్లోని కనకదుర్గమ్మ ఆలయం, బాబా మందిరం, రేబాలలోని పుట్టాలమ్మ ఆలయంలో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి
అమ్మవారి సేవలో ప్రముఖులు
టీటీడీ బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి-అనూరాధ దంపతులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, జిల్లా ఎస్పీ విజయరావు, బుచ్చి జడ్పీటీసీ సభ్యురాలు సూరా ప్రదీప, ఆమె భర్త వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డిలు శుక్రవారం కామాక్షితాయిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ఏసీ,ఈవో, అర్చకులు వారికి స్వాగతం పలికారు. గోత్రనామాలతో పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు అందచేశారు.
మనుబోలు : శుక్రవారం దుర్గాదేవిని పలు రూపాలలో అలంరించారు. మనుబోలులో లలితాపరమేశ్వరీగా, కోదండరామపురంలో భద్రకాళిగా అమ్మవారు దర్శనమిచ్చారు. రెండుచోట్ల దసరా కమిటీ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు.
రాపూరు, సెప్టెంబరు 30: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఐదవ రోజు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెంచలకోనలో ఆదిలక్ష్మి అమ్మవారు గజలక్ష్మిగా, పోతుకొండ అంకమ్మతల్లి లలిత త్రిపురసుందరిగా, కన్యాకాపరమేశ్వరీదేవి చదువులతల్లి వీణాధరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శివాలయంలో పర్వతివర్థిని పార్వతిదేవికి ప్రత్యేకాలంకరణ, పూజలు చేశారు. విశ్వశాంతి ఆశ్రమంలో విజయేశ్వరీదేవి ఆధ్వర్యంలో లతితాదేవికి, ముక్కంటికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.