రాజన్న క్షేత్రం.. భక్తజనసంద్రం

ABN , First Publish Date - 2022-05-24T05:55:06+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం సోమవారం భక్తజన సంద్రంగా మారింది.

రాజన్న క్షేత్రం.. భక్తజనసంద్రం
భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం

- వేములవాడలో కిక్కిరిసిన భక్తులు

వేములవాడ, మే 23: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు.  దీంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. ఆర్జిత సేవలలో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, పూజల టిక్కెట్ల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంబలో అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. 


Updated Date - 2022-05-24T05:55:06+05:30 IST