అప్పుడే రాజీనామా చేద్దామనుకున్నా.. ఇక వైసీపీలో ఉండలేను..

ABN , First Publish Date - 2021-10-09T07:25:46+05:30 IST

వైసీపీకే చెందిన అగ్రవర్ణ వ్యక్తులు తనపై, తన బిడ్డపై, తమ్ముడిపై ఎస్సీ....

అప్పుడే రాజీనామా చేద్దామనుకున్నా.. ఇక వైసీపీలో ఉండలేను..

తిరుపతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): తిరుపతికి చెందిన వైసీపీ బీసీ నేత, ఏపీ రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బొమ్మగుంట రవి తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన ఈ మేరకు కార్పొరేషన్‌ ఎండీకి తన రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కార్పొరేషన్‌కు పాలకవర్గం ఏర్పాటయ్యాక ఇంతవరకూ సమావేశం నిర్వహించిందే లేదని ఆరోపించారు. వైసీపీ జెండాలు మోసిన వాళ్ళను మరచిపోయి, తన సొంత అజెండాతో నడుస్తున్న రంగయ్య లాంటివారు ఛైర్మన్‌గా వున్న కార్పొరేషన్‌లో కొనసాగడం తనకు ఇష్టం లేదన్నారు. తిరుపతి రూరల్‌ మండలంలో తమకు కేటాయించిన దోబీఘాట్‌ స్థలాన్ని వైసీపీకి చెందిన అగ్రవర్ణాల వ్యక్తులు కొందరు స్మశానంగా మార్చేందుకు యత్నించగా తాను అడ్డుకున్నానని వివరించారు. దీంతో వైసీపీకే చెందిన అగ్రవర్ణ వ్యక్తులు తనపై, తన బిడ్డపై, తమ్ముడిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించారని ఆరోపించారు.


వైఎస్‌ అభిమానిగా సుదీర్ఘకాలం కొనసాగినందుకు తనకీ బహుమతి లభించిందని వాపోయారు. కార్పొరేషన్‌ పాలకవర్గ తొలి సమావేశం శుక్రవారం జరగాల్సివుండగా  అక్కడే రాజీనామా చేయాలని భావించానని, అయితే సమావేశం వాయిదా పడిన కారణంగా రాజీనామా లేఖను కార్పొరేషన్‌ ఎండీకి పంపించానని వివరించారు. పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న బీసీ వ్యక్తిని బాధపెట్టడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.

Updated Date - 2021-10-09T07:25:46+05:30 IST