జక్కంపూడి వర్సెస్ భరత్.. నాలుగు గంటలు మాట్లాడిన వైవీ.. జగన్ అరగంట క్లాస్ తీసుకున్నా..
ABN , First Publish Date - 2021-09-29T08:45:49+05:30 IST
రాజమండ్రి వైసీపీ నేతల పంచాయితీ పరిష్కారం కాలేదని తెలిసింది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్..
తెగని రాజమండ్రి పంచాయితీ!
రాజీకి జక్కంపూడి, భరత్ నో
వైవీ సుబ్బారెడ్డి వద్ద 4 గంటలు భేటీ.. అయినా కుదరని సయోధ్య
అనంతరం సీఎంతో సమావేశం.. నేతలిద్దరిపైనా జగన్ ఆగ్రహం
మళ్లీ రచ్చకెక్కితే ఊరుకోనని హెచ్చరిక
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రి వైసీపీ నేతల పంచాయితీ పరిష్కారం కాలేదని తెలిసింది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మధ్య రచ్చకెక్కిన విభేదాలు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు చేరాయి. అధిష్ఠానం ఆదేశాల మేరకు వారిద్దరూ మంగళవారం తాడేపల్లి వచ్చారు. తొలుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా సమావేశం నడచింది. ముందు వారిద్దరితో వైవీ విడివిడిగా మాట్లాడారు. వారిద్దరి మధ్య విభేదాలకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి రాజీ యత్నాలు చేశారు. ఇందుకు మరో గంట పట్టింది. అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. రాజీకి ససేమిరా అన్నారు. దీంతో పంచాయితీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. సాయంత్రం ఐదున్నరకు వైవీ వారిద్దరినీ వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ వారిద్దరిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరస్పరం రోడ్డెక్కితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారపక్షంలో ఉంటూ సీరియల్ విమర్శలు ఏమిటని నిలదీశారు. పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. మరోసారి ఇలా చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అరగంట సేపు క్లాసు తీసుకున్నా.. నేతల మధ్య రాజీ కుదరలేదని స్పష్టమైంది. సీఎంతో సమావేశం ముగిశాక.. భరత్ , వైవీ కలసి బయటకు వచ్చారు. రాజా ఆ తర్వాత వచ్చారు. ఇద్దరూ మీడియాతో మాట్లాడలేదు. బుధవారం రాజమండ్రిలో మాట్లాడతారని అంటున్నారు.