TS News: రాజగోపాల్రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు
ABN , First Publish Date - 2022-07-28T21:24:38+05:30 IST
మ్మెల్యే రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy)కి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న
హైదరాబాద్: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy)కి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ (Congress) నేతలున్నారు. అయితే పార్టీ మార్పుపై తన అనుచరులతో కార్యకర్తలతో ఆయన చర్చిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ చేస్తే...బీజేపీలో చేరవచ్చని వ్యూహంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సస్పెన్షన్పై కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చలేదు. రాజీనామా చేసి పార్టీలోకి రావాలని బీజేపీ (BJP) నేతలు అంటున్నారు. రాజగోపాల్రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధచేస్తోందని ప్రచారం జరిగింది. ఇంతలోనే హైకమాండ్ నుంచి ఆయనకు పిలుపురావడం వెనుక ఉన్న అర్థం ఏమిటో అంతుచిక్కడం లేదు.
బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి (MP Uttam Kumar Reddy) తదితరులు సమావేశమై రాజగోపాల్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సాధ్యమైనంత మేరకు ఆయనను పార్టీలోనే కొనసాగించేందుకు ఒప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మునుగోడులో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని కాదని కోమటిరెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే, సొంత అవసరాల కోసం పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు మునుగోడులో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.