అమరావతిని కాపాడుకుందాం
ABN , First Publish Date - 2021-03-01T05:35:40+05:30 IST
రాష్ట్ర ప్రజలు అమరావతిని కాపాడుకోవాలని రైతులు పిలుపునిచ్చారు.
మూడు రాజధానుల ఆలోచన దుర్మార్గం
439వ రోజుకు చేరిన ఆందోళనలు
తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, ఫిబ్రవరి 28: రాష్ట్ర ప్రజలు అమరావతిని కాపాడుకోవాలని రైతులు పిలుపునిచ్చారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు ఆదివారం 439వ రోజుకు చేరుకున్నాయి. తుళ్ళూరు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, వెలగపూడి, ఐనవోలు, నేలపాడు తదితర రైతు దీక్షా శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అమరావతిని కాదంటే ఐదుకోట్ల మందిని అవమానించినట్లేనని హెచ్చరించారు. రాజధాని అమరావతిపై పాలకులు కక్ష పెంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అంటే అమ్మ లాంటిదన్నారు. అన్నం పెట్టే అమ్మను జగన్రెడ్డి మూడు ముక్కలు చేయాలనుకోవడం దుర్మార్గపు ఆలోచన అన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడకలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. ఐకాస నేతలు స్థానిక రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.