అమరావతిని కాదంటే అంధకారమే..

ABN , First Publish Date - 2020-12-06T05:00:36+05:30 IST

మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర భవిష్యత్‌ అంధకారం అవుతుందని రైతులు పేర్కొన్నారు.

అమరావతిని కాదంటే అంధకారమే..
నీరుకొండ దీక్షా శిబిరంలో జై అమరావతి అని నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించండి 

పాలకులకు రైతుల సూచన

354వ రోజుకు చేరిన ఆందోళనలు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ,  డిసెంబరు 5: మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర భవిష్యత్‌ అంధకారం అవుతుందని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పాలకులు ఆలోచించాలని సూచించారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం 354వ రోజుకు చేరాయి. అనంతవరం, తుళ్లూరు, పెదపరిమి, మందడం, దొండపాడు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, ఐనవోలు, రాయపూడి, లింగాయపా లెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, నేలపా డు, నెక్కల్లు తదితర గ్రామాల్లోని దీక్ష శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ అసెంబ్లీలో అమరావతి రైతుల గురించి అధికార పార్టీ చర్చించకపోవటం దురదృష్టకరమని అన్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే వారి గొంతునొక్కి  బయటకు పంపుతున్నారని పేర్కొ న్నారు. మూడు రాజధానులతో ఐదుకోట్ల మంది ఆంధ్రులు దిక్కుతోచని స్థితికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. స్వ యంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమ రావతి రాజధాని అభివృద్ధి కొనసాగింపుపై  బీజేపీ నాయకులు సీఎం జగన్‌పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతు లు, మహిళలు  నిరసనలు వ్యక్తం చేశారు. మూ డు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. 


Updated Date - 2020-12-06T05:00:36+05:30 IST