నెలాఖరు వరకూ వర్షాలు
ABN , First Publish Date - 2022-06-26T07:37:47+05:30 IST
నెలాఖరు వరకూ వర్షాలు
వచ్చే నెల 3న అల్పపీడనం
ఆరులోగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరణ
విశాఖపట్నం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): పడమర తీరంలో దక్షిణ గుజరాత్ నుంచి కేరళ వరకు తీర ద్రోణి కొనసాగుతోంది. అక్కడ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీ్సగఢ్, ఒడిశా మీదుగా తూర్పు పడమర ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో అరేబియా సముద్రం నుంచి రుతుపవన గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో నెలాఖరు వరకూ వర్షాలు కురవనున్నాయి. ఇదే సమయంలో వచ్చే నెల మూడో తేదీకల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో వచ్చే నెల ఆరో తేదీకల్లా దేశంలో మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ నిపుణుడొకరు వివరించారు. కాగా శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో చెదురుమదరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతిలో 36.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.