చినుకు పడితే నరకమే
ABN , First Publish Date - 2020-12-06T04:08:05+05:30 IST
నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లపై వర్షపు నీటితో పాటు మురుగు నీరు ప్రవహిస్తుంది. దాంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడాల్సిందే.
రోడ్లపై వర్షపు, మురుగు ప్రవాహం
రైల్వే వంతెనల కింద నిలిచిపోతున్న నీరు
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
నగరంలో అధ్వానంగా రహదారులు
నెల్లూరు(స్టోన్హౌస్పేట)డిసెంబరు 5: నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లపై వర్షపు నీటితో పాటు మురుగు నీరు ప్రవహిస్తుంది. దాంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడాల్సిందే. ఎంజీ మాల్ నుంచి ఆత్మకూరు బస్టాండు వరకు ప్రతి సెంటర్లోనూ వర్షం కురిస్తే రోడ్లు చిన్నపాటి చెరువుల్లా మారుతున్నాయి. ప్రధానంగా నగరంలోని గాంధీబొమ్మ సెంటర్, ఆత్మకూరు బస్టాండు బ్రిడ్జి కింద వర్షపు నీటితో మాటు మురుగునీరు నిల్వ ఉంటున్నాయి. నగరంలో శనివారం కురిసిన వర్షానికి ప్రజలు ఎదురుకున్న అవస్థలు వర్ణణాతీతం. ఆత్మకూరు బస్టాండు వద్ద మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జి కింద నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో ప్రజలు తూముపై నడిచారు. ఆడ, మగ, వృద్ధులు, పిల్లలు అన్న తేడా లేకుండా భయం భయంగా అడుగులు వేశారు. నగరంలోని రోడ్లు గుంతలతో నిండి పోవడంతో ఎక్కడ ఏ గుంత ఉందో తెలుసుకోలేక ప్రజలు నిరంతరం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏదేమైనా నగరంలో చినుకు పడితే ప్రజలు నరకం చూడాల్సి వస్తోంది.