సిక్కోలులో కుండపోత

ABN , First Publish Date - 2021-05-06T08:50:23+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో దంచికొట్టింది. బుధవారం సాయంత్రం రాజాం, నందిగాం, వంగర మండలాల్లో భారీ వర్షం పడింది.

సిక్కోలులో కుండపోత

ఉరుములు, పిడుగులతో వర్షం 


అమరావతి/విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 5 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో దంచికొట్టింది. బుధవారం సాయంత్రం రాజాం, నందిగాం, వంగర మండలాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రాజాంలో 58.25 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నందిగాంలో 37.25, వంగరలో 36.25, రేగిడిలో 30.0, ఇచ్ఛాపురంలో 22.5, వీరఘట్టంలో 21.5 మి.మీ. వర్షం పడింది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రాజాం, ఆమదాలవలస, గార ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయనగరం జిల్లాలో విజయనగరం, పార్వతీపురం, సాలూరు, మెంటాడ, బొబ్బిలి, రామభద్రపురం మండలాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా విజయనగరంతో పాటు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. కాగా కర్నూలులో 40.5 డిగ్రీలు, అనంతపురం 40.1 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు తెలిపింది. ఉత్తర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. 

Updated Date - 2021-05-06T08:50:23+05:30 IST