వడగళ్ల వాన బీభత్సం

ABN , First Publish Date - 2022-01-12T05:58:46+05:30 IST

వడగళ్ల వాన బీభత్సం

వడగళ్ల వాన బీభత్సం

  విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

 ధ్వంసం అయిన మిర్చితోటలు

హనుమకొండ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. జనజీవనం స్తంభించి పోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మిర్చితోటలకు అపార నష్టం వాటిల్లింది. సాయంత్రం 6.30 గంటల నుంచి సుమారు గంటపాటు ఆత్మకూరు, పరకాల, నడికుడ, శాయంపేట, కమలాపూర్‌ మండలాల్లో వడగళ్లవాన జోరుగా కురిసింది. పెద్ద పెద్ద మంచుగడ్డలు పడ్డాయి. హనుమకొండలో కూడా గంటపాటు జోరుగా వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హఠాత్తుగా కురిసిన ఈ వడగళ్ల వల్ల వర్షానికి రోడ్లపై ప్రయాణిస్తున్నవారు, ఆరుబయట పనులు చేసుకుంటున్నవారిలో కొందరు గాయపడ్డారు. కొన్ని ఇళ్లపెంకులు పగిలిపోయాయి. వడగళ్లధాటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  గ్రామాల్లో అంధకారం నెలకొంది. 

ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు, కామారం, పెద్దాపురం, అక్కంపేట, నీరుకుళ్ళ, పెంచికల్‌పేట, తిరుమలగిరి, గూడెప్పాడు తదితర గ్రామాల్లో వడగళ్లవాన భారీగా కురిసింది. నడికుడ మండలంలోని ఽనడికుడ, ధర్మారం, కౌకొండ, రాయపర్తి, పులిగిల్ల, కంఠాత్మకూరు తదితర గ్రామాల్లో వడగళ్లు పెద్ద ఎత్తున పడ్డాయి. కమలాపూర్‌ మండలంలోని కమలాపూర్‌, కానిపర్తి, శంభునిపల్లి, అంబాల, గూడూరు తదితర గ్రామాల్లో  మంచుగడ్డలు పెద్దఎత్తున పడ్డాయి. ఎల్కతుర్తి మండలంలో సుమారు గంట పాటు భారీ వర్షం  కురిసి  పరిస్థితి అతలాకుతలం అయింది. శాయంపేట, పరకాల, దామెర మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఐనవోలు మండలంలోని ఐనవోలు ముల్కలగూడెం, నర్సింహులగూడెం,  ఒంటిమామిడిపల్లి, వనమాల కనపర్తి, కొండపర్తి, తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి  ఈదురుగాలులు వీచాయి. ఒంటిమామిడిపల్లి గ్రామంలో రెండు  ఇళ్ళ కప్పులు ఎగిరిపోయాయి. వడగళ్లవానకు మిర్చితోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో కూడా వడగళ్లవాన పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.



 

Updated Date - 2022-01-12T05:58:46+05:30 IST