వాన కష్టాలు
ABN , First Publish Date - 2022-10-01T06:00:13+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేని వానలకు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఉఽధృతంగా ప్రవహిస్తున్న కుందూ
తడిసిపోయిన పంట దిగుబడులు
నీటి కుంటల్లా రహదారులు
చాగలమర్రి, సెప్టెంబరు 30: జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేని వానలకు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరాయి. మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల పొలాలు జలమయమయ్యాయి. రాజోలి ఆనకట్ట వద్ద కుందూనది 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. వక్కిలేరు, వంకలు, వాగులు ఉప్పొంగుతున్నాయి. మినుము, జొన్న పంటలు నీట మునిగాయి.
నీటి కుంటలా రహదారి
చాగలమర్రి గ్రామంలో సోమవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి తహసీల్దార్ కార్యాలయం ముందు రహదారి నీటి కుంటలా మారింది. ఈ దారి వెంట రాకపోకలకు విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
దెబ్బతిన్న పంటలు
ఆళ్లగడ్డ: మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. సబ్ డివిజన్లో 15 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖరీఫ్లో మొక్కజొన్న సాగులో అధిక దిగుబడులు సాధించామనే ఆనందం ఆవిరైంది. ఆరబోసుకున్న మొక్కజొన్న దిగుబడులు వానలకు తడిసిపోయాయి. రంగు మారిన ధాన్యం ధర పలకదని, కొనే వాళ్లు ఉండరని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన సీడు పత్తి పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయిందని, మొక్కలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
సంజామల: సంజామల సమీపంలోని గోండ్రవాగు, పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గత రెండు రోజులుగా వాగు ఉధృతి తగ్గకపోవడంతో శుక్రవారం కోవెలకుంట్ల ఆర్టీసీ డిపో బస్సులను నడపలేదు. కోవెలకుంట్ల నుంచి సంజామల మీదుగా తిమ్మనాయునిపేట, తాడిపత్రికి వెళ్లే ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. సంజామల, గుళ్లదుర్తి రహదారిలో ప్రవహిస్తున్న కప్పలవాగు ఉధృతికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
నష్టపోయిన రైతులు
దొర్నిపాడు: వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సీడు పత్తి పొలాల్లో నీరు నిలిచింది. ప్రకృతి ఏదో ఒక రూపంలో తమను వెంటాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా అకాల వర్షాలతో పంట నష్టపోతున్నామని రైతులు వాపోయారు. మినుము, మిరప పొలాల్లో నీరు నిలిచింది.