గాలివాన బీభత్సం
ABN , First Publish Date - 2021-04-22T06:28:45+05:30 IST
జిల్లాలోని పశ్చిమప్రాంతంలో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రజలను వణికించింది.
పశ్చిమంలో విరిగిపడిన చెట్లు.. లేచిపోయిన రేకులు
కల్లాల్లో తడిచిన మిర్చి
ఎర్రగొండపాలెంలో వడగండ్లు
ఒంగోలు, ఏప్రిల్ 21 : జిల్లాలోని పశ్చిమప్రాంతంలో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రజలను వణికించింది. జిల్లాఅంతటా మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. ప్రత్యేకించి పశ్చిమప్రాంతంలో పూర్తిగా చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వర్షం పడింది. ఎర్రగొండపాలెం.. చుట్టుపక్కల గ్రామాల్లో అరగంటపాటు గాలితో కూడిన వడగండ్ల వాన కురిసింది. చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. రేకుల షెడ్లు గాలికి లేచిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. త్రిపురాంతకంలో ఈదురుగాలులకు త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం వద్ద రెండు చెట్లు నేలకొరిగాయి. దుకాణాల రేకులు లేచిపోయాయి. మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. కల్లాల్లోని మిరపకాయలు తడిచిపోయాయి. గాలులకు పొగాకు బ్యారన్ల రేకులు ఎగిరిపోయాయి. కురిచేడులోనూ వర్షం కురిసింది.