చివరి దశకు డబుల్ ట్రాక్ పనులు
ABN , First Publish Date - 2021-12-06T04:28:54+05:30 IST
భీమవరం– నరసాపురం మధ్య జరుగుతున్న డబుల్ ట్రాక్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
మార్చి నాటికి పూర్తయ్యేలా లక్ష్యం
నరసాపురం, డిసెంబరు 5 : భీమవరం– నరసాపురం మధ్య జరుగుతున్న డబుల్ ట్రాక్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పట్టణం లోని చినమామిడిపల్లి రైల్వేగేట్ వరకు రెండో ట్రాక్ వచ్చేసింది. మరో 100 మీటర్లు వేస్తే స్టేషన్ వరకు చేరుకుంటుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నరసాపురం నుంచి విజయవాడ వరకు సుమారు 132 కిలోమీటర్ల మేర డబుల్ ట్రాక్ పనులు చేపట్టారు. ఈ రూట్ను పూర్తిగా విద్యుత్ లైన్గా మార్చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి భీమవరం వరకు పనులు పూర్తయ్యాయి. నరసాపురం– భీమవరం మధ్య 30 కిలోమీటర్ల పనులు సాగుతున్నాయి. ఈ పనులు వేగవంతానికి ఈ ఏడాది బడ్జెట్లో రైల్వే రూ. 1100 కోట్లు కేటాయించింది. దీంతో పనులు ఊపందుకున్నాయి. డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ– నరసాపురం మధ్య ప్రయాణ వ్యవధి రెండున్నర నుంచి మూడు గంటలు మాత్రమే. ఇప్పటికే భీమవరం వరకు పనులు పూర్తవడం వల్ల క్రాసింగ్ సమస్య తప్పింది. ఈ కారణంగా రైళ్లన్నీ షెడ్యూల్ సమయాలకంటే ముందుగానే చేరుకుంటున్నాయి.