రాత్రికి రాత్రే రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ మార్పు!
ABN , First Publish Date - 2021-03-08T03:51:37+05:30 IST
కావలి రైల్వేస్టేషన్ ఆధునికీకరణలో భాగంగా నూతన టికెట్ బుకింగ్ కార్యాలయం, ప్రధాన ప్రవేశ ద్వార కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే నూతన కార్యాలయాన్ని హడావుడిగా ప్రారంభించారు.
అసంపూర్తిగా పనులు, హడావుడిగా కార్యాలయ ప్రారంభం
అరకొర వసతులతో ప్రయాణికులు, ఉద్యోగుల అవస్థ
కావలి, మార్చి 7: కావలి రైల్వేస్టేషన్ ఆధునికీకరణలో భాగంగా నూతన టికెట్ బుకింగ్ కార్యాలయం, ప్రధాన ప్రవేశ ద్వార కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే నూతన కార్యాలయాన్ని హడావుడిగా ప్రారంభించారు. శనివారం రాత్రి వరకు పాత కార్యాలయంలో ఉన్న టికెట్ బుకింగ్ కౌంటర్, రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ కార్యాలయం ఆదివారం ఉదయానికి నూతన కార్యాలయంలోకి వెళ్లింది. ఎలాంటి ఆర్భాటం లేకుండానే రాత్రికి రాత్రి నూతన కార్యాలయంలోకి మార్చి రిజర్వేషన్ బుకింగ్, ప్లాట్ఫారం టికెట్ విక్రయాలు ప్రారంభించారు. అయితే నూతన కార్యాలయం పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కార్యాలయంలో వసతులు సమకూరకపోవటంతో రైల్వే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ ప్లాట్ఫారం నిర్మాణం పూర్తి కాకుండానే నూతన కార్యాలయం ప్రారంభించటంతో కార్యాలయం నుంచి ఫ్లాట్ ఫారం వద్దకు వెళ్లేందుకు దారి లేదు. కొత్త కార్యాలయంలో మరుగుదొడ్డి వసతులు సమకూర్చక ముందే దానిలోకి మార్చటంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాత టిక్కెట్ బుకింగ్ కౌంటర్ను పగులకొట్టి అక్కడ ప్లాట్ఫారం నిర్మాణం చేట్టాల్సి ఉండటంతో కొత్త భవనంలో పనులు పూర్తి కాకుండానే దానిని హడావుడిగా ప్రారంభించాల్సి వచ్చిందని రైల్వే అధికారులు కొందరు వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి నూతన కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రయాణికులకు, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉంది.