రైల్వేస్టేషన్‌ కళకళ

ABN , First Publish Date - 2020-06-02T08:59:24+05:30 IST

రెండు నెలలుగా వెలవెలబోయిన విజయవాడ రైల్వేస్టేషన్‌ సోమవారం కళకళలాడింది.

రైల్వేస్టేషన్‌ కళకళ

ఆంధ్రజ్యోతి, విజయవాడ /రైల్వేస్టేషన్‌ : రెండు నెలలుగా వెలవెలబోయిన విజయవాడ రైల్వేస్టేషన్‌ సోమవారం కళకళలాడింది. మొత్తం ఆరు రైళ్లు రాకపోకలు సాగించాయి. తెల్లవారుజామున 6.30 గంటలకు గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో 9మంది మాత్రమే వచ్చారు. అయితే, ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లిన వారు చాలామందే ఉన్నారు. ఇక రాత్రి 8 నుంచి 12 గంటల వరకు వరుసగా ఐదు రైళ్లు నడిచాయి.  గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు 231 మంది వెళ్లారు. ఈ రైలులో విజయవాడకు 97 మంది వచ్చారు. హౌరా-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో 35 మంది విజయవాడకు రాగా, విజయవాడ నుంచి 162 మంది వెళ్లారు. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వచ్చే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు 950 మంది ప్రయాణికులు వచ్చారు. 


అంతర్రాష్ట్ర ప్రయాణాలు రద్దు

అంతర్రాష్ట్ర ప్రయాణాలను చివరి నిమిషంలో రద్దు చేయటంతో 15 శాతం మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వీరి రిజర్వేషన్‌ను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ రూపంలో తెలియచేయటంతో ప్రయాణాలు పెట్టుకున్న వారు తీవ్ర అసహనం చెందారు. డివిజన్‌ పరిధిలో విజయవాడ-రాజమండ్రి, విజయవాడ-విశాఖ తదితర ప్రాంతాలకు టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ రైల్వేస్టేషన్‌కు మంగళవారం నుంచి క్రమం తప్పకుండా 14 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

Updated Date - 2020-06-02T08:59:24+05:30 IST