రైలు ప్రయాణికులకు గమనిక... ఇకపై అన్ని ఫిర్యాదులకు ‘139’
ABN , First Publish Date - 2021-03-09T16:12:37+05:30 IST
భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌలభ్యం కోసం...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌలభ్యం కోసం నిరంతరం పలు ఏర్పాట్లు చేస్తుంటాయి. ఇప్పుడు రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్ చేయాల్సిన అవసరంలేదు. రైల్వేశాఖ అన్ని హెల్ప్లైన్ నంబర్లను విలీనం చేసింది. ఇప్పుడు ఈ అన్ని నంబర్లకు బదులు ‘139’ నంబర్ డయల్ చేస్తే సరిపోతుంది. ఫలితంగా రైలు ప్రయాణికులు ఇకపై హెల్ప్లైన్ నంబర్లన్నింటినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు ‘139’ నంబరుకు డయల్ చేసి రైల్వే ప్రయాణానికి సంబంధించిన ఏ ఫిర్యాదునైనా తెలియజేయవచ్చు. ఈ నూతన హెల్ప్లైన్ వినియోగంలోకి రావడంతో మిగిలిన హెల్ప్ లైన్ నంబర్లు ఇక పనిచేయవని రైల్వేశాఖ తెలిపింది.