హైదరాబాద్లో రైల్వే ఉద్యోగి దారుణ హత్య
ABN , First Publish Date - 2021-05-09T19:45:29+05:30 IST
ఇంట్లో ఒంటరిగా ఉన్న రైల్వే ఉద్యోగిని కొబ్బరిబొండం కత్తితో నరికి
- ఇంట్లోకి వచ్చి కొబ్బరిబొండం కత్తితో నరికిన దుండగుడు
- కరోనాతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో..
హైదరబాద్/ఆనంద్బాగ్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న రైల్వే ఉద్యోగిని కొబ్బరిబొండం కత్తితో నరికి హత్యచేసిన సంఘటన మల్కాజిగిరిలో శనివారం జరిగింది. మల్కాజిగిరి న్యూమిర్జాలగూడ, సంతోష్ రెడ్డి కాలనీలో సూర్యశోభ అపార్టుమెంట్స్లో మహేశ్వరి, శంకరరావులు నివసిస్తున్నారు. కరోనా సోకడంతో వారు లాలాగూడా రైల్వే ఆస్పత్రిలో వారంరోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. వారి కొడుకు విజయ్కుమార్(30) రైల్వే ఉద్యోగి. శనివారం ఉదయం 7.30 గంటలకు ఆస్పత్రి నుంచి విజయ్కుమార్ సంతోష్రెడ్డి కాలనీలోని ఇంటికి చేరుకున్నాడు. కొద్ది సమయానికే గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపు తట్టాడు. టవల్, బనియన్తో ఉన్న విజయ్కుమార్ తలుపు తీశాడు.
లోపలికి ప్రవేశించిన ఆగంతుకుడు కొబ్బరి బొండం కత్తితో విజయ్కుమార్ని నరికి హత్యచేశాడు. అనంతరం ఇంటికి గడియపెట్టి పారిపోయాడు. విజయకుమార్ అరుపులు విన్న అదే అపార్టుమెంట్ వాసి ప్రేమలత వారి బంఽధువైన మద్ది శారదకు ఫోన్ద్వారా సమాచారం ఇచ్చింది. వెంటనే ఆమె ఇంటికి వచ్చి గడియ తీసుకుని లోపలికి వెళ్లి చూడగా బెడ్రూంలో మంచంపై విజయకుమార్ రక్తం మడుగులో అచేతనంగా పడి ఉన్నాడు. ఇరుగుపొరుగు వారి సహకారంతో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ శ్యాంసుందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి, మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు పోలీసు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పరిచయస్థుడి లాగానే..
అంగతుకుడు విజయ్కుమార్ కుటుంబానికి పరిచయస్థుడిలాగానే అపార్టుమెంట్ వాసులతో వ్యవహరించాడు. అపార్టుమెంట్లోకి ప్రవేశిస్తున్నపుడే అతనిని నిలువరించి ఎవరని ప్రశ్నించారు. శంకర్రావు దంపతుల ను ఆస్పత్రిలో చూసి వస్తున్నానని, వారి అబ్బాయిని కలిసేందుకు వచ్చానని చెప్పి నేరుగా ఆయన ఫ్లాట్కు వెళ్లాడని స్థానికులు తెలిపారు.