తుక్కు ఆదాయంలో వాల్తేరు డివిజన్ రికార్డు
ABN , First Publish Date - 2020-11-01T02:33:22+05:30 IST
కరోనా సమయంలో ప్రయాణికుల నుంచి ఆదాయం పూర్తిగా పడిపోవడంతో ఇతర ఆదాయ మార్గాలపై వాల్తేరు రైల్వే డివిజన్ దృష్టి సారించింది. రైల్వే ట్రాకులు, వర్క్షాపుల్లో వృథాగా పడివున్న పనికిరాని సామాన్లు అన్నింటిని సేకరించి వేలం వేసి గతంలో ఎన్నడూ లేనంత ఆదాయం రాబట్టింది. అక్టోబరు మొదటి వారంలో వేలం నిర్వహించగా రూ.7.43 కోట్ల ఆదాయం వచ్చింది.
నెలలో రూ.15.02 కోట్లు జమ
విశాఖపట్నం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో ప్రయాణికుల నుంచి ఆదాయం పూర్తిగా పడిపోవడంతో ఇతర ఆదాయ మార్గాలపై వాల్తేరు రైల్వే డివిజన్ దృష్టి సారించింది. రైల్వే ట్రాకులు, వర్క్షాపుల్లో వృథాగా పడివున్న పనికిరాని సామాన్లు అన్నింటిని సేకరించి వేలం వేసి గతంలో ఎన్నడూ లేనంత ఆదాయం రాబట్టింది. అక్టోబరు మొదటి వారంలో వేలం నిర్వహించగా రూ.7.43 కోట్ల ఆదాయం వచ్చింది. మళ్లీ రెండోసారి సేకరించిన తుక్కును వేలం వేయగా రూ.7.59 కోట్లు వచ్చింది. ఒక్క నెలలో తుక్కు విక్రయం ద్వారా రూ.15.02 కోట్లు రావడం రికార్డు అని వాల్తేరు డివిజన్ అధికారులు పేర్కొన్నారు. డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ నేతృత్వంలో మెటీరియల్స్ మేనేజ్మెంట్ చీఫ్ ప్రిన్సిపల్ మేనేజర్ పీబీ నివానే, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ త్రిపాఠీ కలిసి ఈ ఆదాయం రావడానికి కృషి చేసినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. వీటి వేలం కూడా జాతీయ స్థాయిలో ఆన్లైన్ విధానంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్టు వివరించారు.