నెల్లూరు జిల్లాలో రేషన్‌ కార్డుల ఏరివేత..!

ABN , First Publish Date - 2021-10-13T04:08:43+05:30 IST

బియ్యం పంపిణీ చేసే వాహనం వద్దకు వెళ్లిన పలువురు లబ్ధిదారులు షాక్‌కు గురవుతున్నారు. మీకు బియ్యం రాలేదని ఆపరేటర్‌ సమాధానం చెపుతుండడంతో వారు ఖంగుతింటున్నారు.

నెల్లూరు జిల్లాలో రేషన్‌ కార్డుల ఏరివేత..!
వాహనం వద్ద బియ్యం తీసుకొంటున్న లబ్ధిదారులు(ఫైల్‌)

మండలంలో 724 తొలగింపు

ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 12: బియ్యం పంపిణీ చేసే వాహనం వద్దకు వెళ్లిన పలువురు లబ్ధిదారులు షాక్‌కు గురవుతున్నారు. మీకు బియ్యం రాలేదని ఆపరేటర్‌ సమాధానం చెపుతుండడంతో వారు ఖంగుతింటున్నారు. కొన్ని నెలలుగా నిత్యావసర వస్తువులు తీసుకోని వారు, ప్రభుత్వ ఉద్యోగులు కార్డులు తొలగించేశారు. కార్డులో ఈకేవైసీ చేయించుకోని లబ్ధిదారులకూ యూనిట్లు తగ్గించేశారు. అందులో భాగంగా మండలంలో 724 కార్డులు తొలగించడంతో లబ్ధిదారులకు కారణం తెలియక లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేవారు, నాలుగు చక్రాల వాహనాల కలిగి ఉన్న కుటుంబాలకు చెందిన కార్డులను రద్దు చేశారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో వలసలు అధికం. నియోజకవర్గంలో 40 శాతం మంది పొట్టచేతపట్టుకొని ఇతర రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్నారు. వారంతా పండుగలు, శుభకార్యాలకు గ్రామాలకు వస్తుంటారు. అలాంటి వారు నెలల తరబడి బియ్యం తీసుకోలేరు. ప్రభుత్వం ఐదారు నెలలుగా బియ్యం తీసుకోని వారి కార్డులను రద్దు చేస్తుండడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు ఈకేవైసీ కోసం ఆధార్‌ కేంద్రానికి వెళ్లినా వేలి ముద్రలు పడకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వలసవాసులు, వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని వేడుకొంటున్నారు.


Updated Date - 2021-10-13T04:08:43+05:30 IST