పంజాబ్కు విజనరీ నేత రాహుల్ రాక : సిద్ధూ
ABN , First Publish Date - 2022-01-25T21:25:30+05:30 IST
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ''విజనరీ నేత''గా ఆ పార్టీ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ''విజనరీ నేత''గా ఆ పార్టీ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభివర్ణించారు. తమ పార్టీ విజనరీ నేత రాహుల్ గాంధీ ఈనెల 27న పంజాబ్లో పర్యటించనున్నట్టు ఒక ట్వీట్లో ఆయన తెలియజేశారు. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎదురుచూస్తున్నారని అన్నారు. రాహుల్ టూర్ షెడ్యూల్ను కూడా ఆయన ట్వీట్కు జోడించారు.
రాహుల్ పంజాబ్ పర్యటన షెడ్యూల్ ప్రకారం అమృత్సర్లోని శ్రీ హర్మందిర్ సాహిబ్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. పార్టీ తరఫున పోటీ చేసే 117 మంది అభ్యర్థులతో కలిసి భగవాన్ వాల్మీకి తీర్థ్ స్థల్ను సందర్శిస్తారు. అనంతరం జలంధర్లో జరిగే వర్చువల్ ర్యాలీలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు.