చైనా రాయబారిని రహస్యంగా రాహుల్ కలిశారు: నడ్డా
ABN , First Publish Date - 2020-07-12T21:25:28+05:30 IST
చైనా రాయబారిని రహస్యంగా రాహుల్ కలిశారు: నడ్డా
న్యూఢిల్లీ: డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా రాయబారిని రాహుల్ గాంధీ 'రహస్యంగా' కలిశారని, దేశంపై ఆయనకు ఉన్న ప్రేమ బూటకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కేరళలోని కాసరగాడ్లో 'డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ మందిర్' పేరుతో కొత్తగా నిర్మించిన బీజేపీ జిల్లా కమిటీ కార్యాలయాన్ని ఆదివారంనాడు ప్రారంభించిన అనంతరం నడ్డా మాట్లాడారు.
'డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా రాయబారిని రాహుల్ కలుసుకున్నారనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు (రాహుల్) దేశాన్ని తప్పుదారి పట్టించారు. ఈ విషయం దేశ ప్రజలకు చెప్పలేదు. ఇద్దరూ కలిసిన ఫోటోను ఆన్లైన్లో చైనా రాబయబారి పోస్ట్ చేశారు. ఇదీ దేశంపై మీకున్నబూటకపు దేశభక్తి. రక్షణ కమిటీ సమావేశాలకు మీరు 11 సార్లు గైర్హాజరయ్యారు. మీరు దేశాన్ని నడిపే తీరు ఇది' అని నడ్డా విమర్శించారు. కేరళలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్, కాంగ్రెస్లు దేశాన్ని ఎప్పుడూ చీకటిలోనే ఉంచుతాయని, ఆ పార్టీల కార్యకర్తలంతా బీజేపీలో చేరి పార్టీని పటిష్టం చేయాలని నడ్డా కోరారు.