గుడి, దర్గా, చర్చిలో రాహుల్‌

ABN , First Publish Date - 2022-10-04T09:50:09+05:30 IST

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సోమవారం మైసూరుకు చేరుకుంది.

గుడి, దర్గా, చర్చిలో రాహుల్‌

మైసూరు చేరుకున్న ‘జోడో యాత్ర’

బెంగళూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సోమవారం మైసూరుకు చేరుకుంది. ఉదయం మైసూరు ఆర్‌ గేట్‌ వద్ద రాహుల్‌ పాదయాత్రను పునఃప్రారంభించారు. చాముండేశ్వరి ఆలయంలో రాహుల్‌ పూజలు చేశారు. తర్వాత సుత్తూరు మఠానికి వెళ్లి, మఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామీజీ ఆశీస్సులు పొందారు. అనంతరం ఇజాం దర్గాను సందర్శించారు. అనంతరం సెయింట్‌ ఫిలోమినాస్‌ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. మైసూరులో దసరా ఉత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న తరుణంలో మంగళ, బుధవారాలు పాదయాత్రకు విరామం ప్రకటించారు. మరోవైపు భారత్‌ జోడో యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కర్ణాటక చేరుకున్నారు. ఆమెకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య స్వాగతం పలికారు. కాగా, పాదయాత్ర అనంతరం పార్టీ అధ్యక్ష ఎన్నికలపై రాహుల్‌ తల్లి సోనియాగాంధీతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో పారదర్శకత కోసం పార్టీ ఆఫీసు బేరర్లెవరూ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ ఆదేశించింది. 

Updated Date - 2022-10-04T09:50:09+05:30 IST