రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాల్సిందే: రాజస్థాన్ సీఎం

ABN , First Publish Date - 2022-03-13T23:47:59+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాల్సిందే: రాజస్థాన్ సీఎం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రధానిగా కానీ, మంత్రిగా కానీ లేరన్న విషయాన్ని ఈ  సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఐక్యతకు గాంధీ కుటుంబం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలని కోరారు.


పంజాబ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై గెహ్లాట్ మాట్లాడుతూ.. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఐక్యంగా ఉందని, అందుకే గెలిచిందని అన్నారు. చన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాతావరణం అనుకూలించిందని అయితే, అంతర్గత విభేదాల కారణంగా పంజాబ్ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. పనిలో పనిగా బీజేపీపైనా గెహ్లాట్ దుమ్మెత్తి పోశారు. 


ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీగా సామాజిక మాధ్యమాల్లో బీజేపీ విపరీత ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. నిజానికి మతపరమైన అంశాల్లో బీజేపీనే ముందుంటుందని విమర్శించారు. దేశ సమగ్రతను కాపాడడమే తమ లక్ష్యమని అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ మతాన్ని ముందుకు తెస్తుందని, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు వంటివి వెనక్కి వెళ్లిపోతాయని ఆరోపించారు.

Updated Date - 2022-03-13T23:47:59+05:30 IST