పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఈ నెల 6న?

ABN , First Publish Date - 2022-02-03T17:03:27+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి

పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఈ నెల 6న?

న్యూఢిల్లీ : పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్‌కు కాంగ్రెస్  త్వరలో తెర దించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6న ప్రకటిస్తారని సమాచారం. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. ఆదివారంనాడు (ఈ నెల 6న) రాహుల్ గాంధీ పంజాబ్‌లో పర్యటిస్తారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తామని జనవరి 27న రాహుల్ పంజాబ్‌లో పర్యటించినపుడు చెప్పారు. పార్టీ కార్యకర్తలను సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తమలో ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ సహకరిస్తామని సిద్ధూ, చన్నీ హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం అభ్యర్థిని ప్రకటించాలని సిద్ధూ డిమాండ్ చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. 


ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. శక్తి యాప్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆమె కోరినట్లు సమాచారం. 


మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీనే సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఆయన షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఆయనకు సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్లు సమాచారం. చన్నీ ఈ ఎన్నికల్లో చమ్‌కౌర్, భడౌర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. 



Updated Date - 2022-02-03T17:03:27+05:30 IST