వైష్ణో దేవి దేవాలయం వద్ద దుర్ఘటనపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2022-01-01T19:50:39+05:30 IST
జమ్మూ-కశ్మీరులోని మాతా వైష్ణో దేవి దేవాలయం
న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులోని మాతా వైష్ణో దేవి దేవాలయం వద్ద శనివారం జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 13 మంది వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.
రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్లో, ‘‘మాతా వైష్ణో దేవి దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాట చాలా విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
మాతా వైష్ణో దేవి దేవాలయానికి శనివారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అకస్మాత్తుగా తొక్కిసలాట జరగడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని నారాయణ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు.
జమ్మూ-కశ్మీరు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, శుక్రవారం-శనివారం రాత్రి 2.45 గంటలకు ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోందన్నారు. వాగ్వాదానికి దిగినవారు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలిసిందన్నారు.
ఈ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50,000 చొప్పున సాయం ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.