పీఎం జన్‌ధన్ లూట్ యోజన ఇదే: మోదీపై రాహుల్ విసుర్లు

ABN , First Publish Date - 2022-04-04T23:51:03+05:30 IST

దేశంలో రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతుండటంపై మోదీ ప్రభుత్వాన్ని ..

పీఎం జన్‌ధన్ లూట్ యోజన ఇదే: మోదీపై రాహుల్ విసుర్లు

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతుండటంపై మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ''ప్రధాన్ మంత్రి జన్ థన్ లూట్ యోజన'' అనే శీర్షికతో గ్రాఫిక్‌తో కూడిన ఓ ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు. 2014 మేలో బైకు, కారు, ట్రాక్టర్, కారు వంటి వాహనాల్లో ఇంధనం ఫుల్ ట్యాంక్ ధరను, ఇప్పటి ధరతో ఇందులో పోల్చారు.


రాహుల్ విడుదల చేసిన గ్రాఫిక్ లెక్కల  ప్రకారం 2014లో స్కూటర్/బైక్ ఫుల్ ట్యాంక్ ఇంధనం ధర రూ.714. అది ప్రస్తుతం రూ.1,038కి చేరింది. కారు ఫుట్‌ట్యాంక్ ధర అప్పట్లో రూ.2.856, ప్రస్తుతం రూ.4,141. ట్రాక్టర్ ఫుల్ ట్యాంక్ ఇంధనం ధరం అప్పట్లో రూ.2,749, ప్రస్తుతం రూ.4,563. దీనిని ''ప్రధాన్ మంత్రి జన్ థన్ లూట్ యోజన''గా రాహుల్ ఆ ట్వీట్‌లో అభివర్ణించారు.


దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణ విషాదంతో ప్రతి రోజు మొదలవుతోందని, ఇవాళ ఉదయం ఇంధనం దోపిడీతో, పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌కు 40 పైసల పెంపుతో మొదలైందని అన్నారు. సీఎన్‌జీ మరింత ప్రియంగా మారి కిలోకు రూ.2.50 పెరిగిందని, రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధర రూ.8.40 పెరిగిందని చెప్పారు. బీజేపీకి ఓటు వేయడాన్ని ద్రవ్యోల్బణానికి ఇచ్చిన తీర్పుగా ఆయన విమర్శించారు. 


రాజ్యసభలోనూ మంటలు..

మరోవైపు, ఇంధనం ధరలను ప్రభుత్వం నిరంతరాయంగా పెంచుకుంటూ పోతుండంపై చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు సోమవారంనాడు రాజ్యసభలో నిరసనలకు దిగారు. దీంతో సభా కార్యక్రమాలను చైర్మన్ వాయిదా వేశారు. పలువురు విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులు చైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. రెండు సార్లు సభ వాయిదా పడి మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యులు తమ డిమాండ్‌పై పట్టుబట్టడంతో అధ్యక్ష స్థానంలో ఉన్న సస్మిత్ పాత్ర సభను రేపటికి వాయిదా వేశారు.

Updated Date - 2022-04-04T23:51:03+05:30 IST