ఎల్లుండి చెన్నైకి Rahul
ABN , First Publish Date - 2022-02-26T13:53:24+05:30 IST
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 28న చెన్నైకు రానున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రంలో పాల్గొంటారు. అలాగే, ఇటీవల జరిగిన
- ‘పుర’ విజేతలతో సమావేశం
అడయార్(చెన్నై): కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 28న చెన్నైకు రానున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రంలో పాల్గొంటారు. అలాగే, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు ఏఐసీసీ వ్యవరాల ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితల వెల్లడించారు. రాహుల్ చెన్నై పర్యటన సందర్భంగా స్వాగత ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చెన్నితల శుక్రవారం చర్చించారు. అంతేకాకుండా ఈ పర్యటన సమయంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులతో కూడా రాహుల్ ప్రత్యేకంగా సమావేశమయ్యేలా కార్యక్రమ షెడ్యూల్ను తయారుచేస్తున్నారు. మరోవైపు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4వ తేదీన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీ చైర్మన్ల ఎంపిక కోసం పరోక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సి వ్యూహ ప్రతివ్యూహాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రమేష్ రాయపేటలోని సత్యమూర్తి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా వుండగా ఈ అంశంపై ఈ నెల 27వ తేదీన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎన్నికల కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలతో ఆయనతో పాటు టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్. అళగిరి ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇందులోనే రాహుల్ గాంధీ చెన్నై పర్యటనపై చర్చించి, నిర్ణయాలకనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు.